Wednesday, 16 January 2013

[YSR ] మానవ హక్కుల ఉల్లంఘన: విజయమ్మ


న్యూఢిల్లీ: దర్యాప్తు పేరుతో సీబీఐ దారుణమైన మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోపించారు. వైఎస్ జగన్‌ కేసులో సత్వర న్యాయం కోసం రాష్ట్రపతి జోక్యం కోరామని విజయమ్మ అన్నారు. ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడినందుకే జగన్‌ను దోషిగా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమె అన్నారు. 

'ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన జరిగిందా? లేదా? అనే అంశాన్ని సీబీఐ పరిశీలించలేదని, కాంగ్రెస్‌కు బలమైన పునాది వైఎస్ అన్న విషయం మీకూ తెలుసు అని రాష్ట్రపతికి విజయమ్మ తెలిపారు. వైఎస్‌ది మడమ తిప్పని శైలిని మీకు గుర్తుండే ఉంటుందని' ప్రణబ్ తో విజయమ్మ అన్నట్టు రాష్ట్రపతి భవన్ బయట జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 

కేటాయింపుల విషయంలో వైఎస్ఆర్ ఏనాడు గీత దాటలేదనే విషయాన్ని సీఎం కిరణ్‌ కూడా ఒప్పుకున్నారనే విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వపరంగా తప్పు జరగనప్పుడు క్విడ్‌ప్రోకో ఎక్కడిది, వైఎస్‌ జగన్‌ను ఎందుకు కస్టడీలోకి తీసుకున్నట్లు అని విజయమ్మ ప్రశ్నించారు. జగన్ కు జరిగిన అన్యాయాన్ని మీరు తీర్చిదిద్దుతారనే నమ్మకంతో 2 కోట్ల మంది చేస్తున్న సవినయ విన్నపమిది అని అన్నారు. 'ఈ కేసులో శక్తిమంతమైన మీ జోక్యం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు' అని విజయమ్మ విజ్క్షప్తి చేశారు. ఈ అన్యాయం మరో రోజు కొనసాగకుండా చూస్తారని ఆశిస్తున్నాను అని ప్రణబ్ ముఖర్జీకి విజయమ్మ నివేదించారు. రాష్ట్రపతితో జరిగిన భేటిలో రెండుకోట్ల మంది రాష్ట్ర ప్రజల సంతకాల పిటిషన్‌ను రాష్ట్రపతికి అందించారు. అపాయింట్ మెంట్ ఇచ్చినందుకు రాష్ట్రపతికి వైఎస్ విజయమ్మ ధన్యవాదాలు తెలిపారు.