* పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజం
* దానికి నిరసనగానే పార్టీని వీడుతున్నా.. వైఎస్సార్సీపీలో చేరుతున్నా సాక్షి, హైదరాబాద్: టీడీపీ అవలంబిస్తున్న అవకాశవాద రాజకీయాలకు నిరసనగా ఆ పార్టీని వీడుతున్నట్లు చిత్తూరు జిల్లా పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రకటించారు. చంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన గురువారం ప్రత్యేక ములాఖత్లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్కు వెన్నుదన్నుగా నిలిచేందుకు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రెండేళ్లుగా టీడీపీ.. కాంగ్రెస్తో చెట్టపట్టాలేసుకుని పనిచేయటం బాధ కలిగిస్తోందన్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటినుంచి సేవలందించిన కుటుంబాలు 30 ఏళ్ల తరువాత ఎందుకు బయటకు వెళుతున్నాయనే విషయాన్ని టీడీపీ నేతలు అవగతం చేసుకోవాలన్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ భూస్థాపితమైనట్లేనన్నారు. కాగా జగన్ను చంచల్గూడ జైల్లో కలిసిన వెంటనే చింతల రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీ మీడియాకు ఎస్ఎంఎస్ సమాచారం పంపింది. |