Monday, 28 January 2013

[YSR ] రేపు ఇడుపులపాయకు జనం సంతకాలు


‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమంలో రెండు కోట్ల మంది ప్రజలు చేసిన సంతకాల ప్రతులను ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద భద్రపరచనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిపారు. జగన్‌పై ఆదరాభిమానాలతో ప్రజలు చేసిన సంతకాలను ప్రత్యేక పెట్టెల్లో భద్రపరిచామని ఆదివారమిక్కడ వెల్లడించారు. సంతకాల పెట్టెలను తీసుకెళ్లే ఈ యాత్రకు కృతజ్ఞత యాత్రగా పార్టీ నామకరణం చేసినట్లు చెప్పారు. ఈ కృతజ్ఞత యాత్ర 29వ తేదీ ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమై 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇడుపులపాయకు చేరుతుందన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇడుపులపాయలో వీటిని స్వీకరించి వైఎస్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన గదిలో భద్రపరుస్తారని వివరించారు. కృతజ్ఞతయాత్ర వాహనం 29న హైదరాబాద్ నుంచి బయలుదేరి శంషాబాద్, షాద్‌నగర్, కొత్తకోట, కర్నూలు గుండా అదే రోజు రాత్రికి నంద్యాల చేరుకుంటుంది. మరుసటి రోజు అక్కడి నుంచి బయలుదేరి ఆళ్లగడ్డ, మైదుకూరు, కడప గుండా ఇడుపులపాయ చేరుతుందని గట్టు తెలిపారు.