[YSR ] ప్యాకేజీ మాట్లాడుకోవడానికి నెలరోజుల పాటు ఢిల్లీలో మకాం ...

టీఆర్ఎస్
అధినేత కె.చంద్రశేఖర్రావు తప్పుడు సంకేతాలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి,
వాళ్ల రక్తంతో రూ.కోట్లకు పడగలెత్తారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి
కొండా సురేఖ ధ్వజమెత్తారు. ప్యాకేజీ మాట్లాడుకోవడానికి నెలరోజుల పాటు
ఢిల్లీలో మకాం వేసిన ఆయన రేటు కుదరక తిరిగి వచ్చాడని, ఇప్పుడేమో తెలంగాణ
ప్రజల రక్తం తాగేందుకు సిద్ధమయ్యాడని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నేత
షర్మిల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం గద్వాలలో జరిగిన సభలో ఆమె
ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్పై నిప్పులు చెరిగారు. వైఎస్సార్
కుటుంబం అంటే ఏమిటో, రాష్ట్రంలో ఆ కుటుంబానికి ఎంతటి అభిమానం ఉందో
టీఆర్ఎస్ నాయకులకు తెలియదు. జగనన్నను జైలులో పెడితే విజయమ్మ బయటకు
వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో షర్మిలమ్మ ముందుకొచ్చి మనందరికీ అండగా
నిలబడ్డారని తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మహబూబ్నగర్లో ఎంపీగా గెలిచిన
కేసీఆర్, వాళ్ల పార్టీ ఒక ఎత్తు అని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో
పాలమూరులో పళ్లు రాలగొడితే, పరకాలలో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టయింది.
ఇప్పుడు తెలంగాణలో షర్మిలమ్మ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి వారికి
నిద్రపట్టడం లేదని విమర్శించారు. నల్లగొండ జిల్లా నుంచి జిట్టా
బాలకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు వైఎస్సార్సీపీలో చేరితేనే
సూర్యాపేటలో సభ పెట్టుకోవాల్సి వచ్చిందని, వచ్చే రోజుల్లో ఒక్కో జిల్లాలో
టీఆర్ఎస్ వందకంటే ఎక్కువ సభలే పెట్టుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.
వైఎస్ కుటుంబాన్నే టార్గెట్ చేస్తూ ప్రేలాపనలు పలికిన కేసీఆర్కు
సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. 12
సంవత్సరాలుగా ఉద్యమం పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న నీకు వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఆమెరికా నుంచి
కొడుకు, కూతురుని పిలిపించుకుని పోస్టులు అప్పజెప్పితే తప్పు లేనిది
విజయమ్మ, షర్మిల బయటకు వస్తే తప్పా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్తోనే
తెలంగాణ సాధ్యమని చెబుతున్నారు.. నెల రోజులు ఢిల్లీలో మకాం వేసి చివరకు
అఖిలపక్షమైనా పెట్టించగలిగారా అని నిలదీశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది
పార్టీని విలీనం చేయడానికి కాదు.. ప్యాకేజీ మాట్లాడుకోవడానికి అని
మండిపడ్డారు. దీనిని తెలంగాణ ప్రజలు గ్రహించాలని సురేఖ కోరారు. తెలంగాణ ఎలా
తెస్తావో ఏ ఒక్కరికైనా విడమరిచి చెబుతున్నావా అని ప్రశ్నించారు. వైఎస్సార్
ఐదేళ్ల పాలనను చూసిన ప్రజలు మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని రెండోసారి
గెలిపించారని పేర్కొన్నారు. ఆయన మరణించిన నాటినుంచి ఏ వర్గానికి చెందిన
ప్రజలూ ప్రశాంతంగా నిద్రపోలేదని వాపోయారు. పదవులు ఎలా కాపాడుకోవాలా? అని
అధికార పార్టీ, ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టాలా అని ప్రతిపక్ష టీడీపీ
పనిచేస్తున్నాయని విమర్శించారు.