
‘‘ప్యాకేజీలు
ఇచ్చి ఎమ్మెల్యేలను ఆకట్టుకునే దుస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి
లేదు. సీటిస్తామంటే ఇప్పటికిప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో
చేరేందుకు 70 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడువన్నీ పసలేని ఆరోపణలే. కాంగ్రెస్ పార్టీ
ప్రజల విశ్వాసం కోల్పోయింది. అవిశ్వాసం పెట్టి ఎన్నికలు వస్తే టీడీపీకి
కూడా డిపాజిట్లు గల్లంతవుతాయని చంద్రబాబుకు భయం. అందుకే అవిశ్వాసం
పెట్టకుండా పాదయాత్ర పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు’’ అని వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ ఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.
ఆయన
ఆదివారమిక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీకి
ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఎంతోమంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు
ముందుకు వస్తున్నారని బాలినేని చెప్పారు. అయితే ఎవరినంటే వారిని పార్టీలోకి
తీసుకుని సీట్లిచ్చే పరిస్థితి లేదన్నారు. వ్యక్తిత్వం బాగుండి, ప్రజా
మద్దతు ఉన్నవారికే రానున్న ఎన్నికల్లో సీట్లు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు.