Monday, 19 November 2012

[YSR ] హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్ఆర్‌ కల: షర్మిల

హంద్రీనీవా ప్రాజెక్టు పనులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 95 శాతం పూర్తి చేశారని షర్మిల అన్నారు. కర్నూలు జిల్లాలోని షర్మిల పాదయాత్ర పోలకల్లుకు చేరుకుంది. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మిగిలిన 5 శాతం హంద్రీనీవా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వానికి 3 ఏళ్లు పట్టిందని షర్మిల మండిపడ్డారు.

6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కృషి చేసిన వ్యక్తి వైఎస్‌ఆర్ అని అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమంలో ఎన్ టీఆర్, విజయ్‌భాస్కర్‌రెడ్డి పేర్లు ప్రస్తావించి వైఎస్ఆర్ పేరు ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమని షర్మిల అన్నారు.

వైఎస్ఆర్ పేరు ప్రస్తావించకపోవడం కిరణ్ అహంకారానికి నిదర్శనమని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో వైఎస్‌ఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని, సీల్డ్ కవర్‌లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కిరణ్‌ అని షర్మిల విమర్శించారు.

గురు రాఘవేంద్ర, హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా తాగునీరు అందించిన ఘనత వైఎస్‌ఆర్‌దేనని ఈ సందర్భంగా తెలిపారు. అప్పులు ఎక్కువై రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మహిళలు, విద్యార్థులకు వైఎస్‌ఆర్ ఎంతో మేలు చేశారని అన్నారు. అయితే ఈ ప్రభుత్వం మహిళలు, విద్యార్థులు, రైతులను పట్టించుకోవడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.