Saturday, 13 October 2012

[YSR Congress Party] వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆపార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైంది. భవిష్యత్‌ కార్యాచరణపై ఆపార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. పార్టీని పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలతో పాటు సమస్యలపై మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలని పార్టీ నిర్ణయించింది. నేటి పార్టీ విస్తృతస్ధాయి సమావేశం తర్వాత పలు కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలంతా ఈ నెల 6న కేంద్రకార్యాలయంలో రెండు విడతలుగా సమావేశమయ్యారు. సమావేశంలో చర్చించిన అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడితో పాటు గౌరవ అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్ళారు. 

అనంతరం ఈ నెల 8 న పార్టీ కేంద్రపాలకమండలి, కేంద్రకార్యనిర్వాహకమండలి సభ్యులతో కూడా విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలనుకున్నా...పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్ళాళ్సిరావడం వల్ల ఈ సమావేశం బుధవారానికి వాయిదా పడింది. 

ఈ సమావేశానికి సీజీసీ, సీఈసీ సభ్యులంతా హాజరు అయ్యారు. నేడు జరిగే విస్తృతస్థాయి సమావేశంలో కూడా అందరి అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకుని తదుపరి కార్యాచరణను పార్టీ నేతలు ప్రకటించనున్నారు. మొత్తానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశపు నిర్ణయాలు ఆ ఉత్కంఠకు తెరదించే అవకాశాలున్నాయి.