Monday, 29 October 2012

[YSR Congress Party] గ్యాస్ ధరను మొదటిసారి పెంచినది టిడిపి అధ్యక్షుడు చంద్రబాబే


గ్యాస్ ధరను మొదటిసారి పెంచినది టిడిపి అధ్యక్షుడు చంద్రబాబేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. సప్తగిరి సర్కిల్ లో ఈ సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. బాబు పాలనలో వంట గ్యాస్ ధర 145 నుంచి 305 రూపాయలకు పెరిగిందన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో గ్యాస్ ధర అసలు పెరగలేదని గుర్తు చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, మద్యపాన నిషేధ పథకాలకు చంద్రబాబు పాతరేశారని విమర్శించారు.

ఈ జిల్లా అంటే వైఎస్ఆర్ కు అభిమానం ఎక్కువని ఆమె చెప్పారు. జలయజ్ఞంలో అనంతపురం జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించారన్నారు. హంద్రీ నీవా కోసం వైఎస్ఆర్ జిఓ విడుదల చేస్తే, ఈ ప్రభుత్వం దానిని తొక్కిపెట్టిందన్నారు. ఈ నేతల వల్ల తాగునీరుకు కూడా కష్టమవుతోందన్నారు. ఫీజుల పథకానికి ఈ ప్రభుత్వం పాతరేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కై జగనన్నని వేధిస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టిడిపి ఆ పని చేయడంలేదని చెప్పారు.