భువనగిరి:
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వవలసింది
కేంద్ర ప్రభుత్వమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్
విజయమ్మ తెలిపారు. కానీ తెలంగాణలో రావణకాష్టం రాజేశారన్నారు. అనేక మంది
మరణించారని ఆమె బాధపడ్డారు. తెలంగాణలోని మరణాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత
వహించాలన్నారు. యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె
ప్రసంగించారు. వైఎస్ఆర్ ప్రాణాలు పోయేంతవరకు ఈ ప్రాంతాన్ని ప్రేమించారని
చెప్పారు. ఇక్కడి కష్టాలు ఆయనకు తెలుసని, తెలంగాణ వెనుకబాటుని ఆయన
గుర్తించారని వివరించారు. ఆయన చేయవలసినంత ఈ ప్రాంతానికి చేశారన్నారు.
రాజశేఖర రెడ్డికైనా, జగన్ కైనా తెలంగాణ పట్ల వ్యతిరేకత లేదని చెప్పారు.
మనిషిని మనిషిగా ప్రేమించడమే ఆయన నేర్పించారని తెలిపారు. అందరూ కలిసి
ఉండాలని వైఎస్ఆర్ ఆశించారని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం ఆయనకు లేదన్నారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం
రాజీనామాలు చేసిన వారిపై తమ పార్టీ పోటీ కూడా పెట్టలేదని తెలిపారు. ఈ
ప్రాంత ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇచ్చే పోటీ పెట్టలేదని చెప్పారు. పార్టీ
ప్లీనరీలో కూడా తాము తెలంగాణకు వ్యతిరేకులం కాదని జగన్ స్పష్టం చేసిన
విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా కేంద్రం
నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు.
బాలకృష్ణా రెడ్డితోపాటు పార్టీలో చేరినవారందనినీ విజయమ్మ అభినందించారు.
బాలకృష్ణా రెడ్డితోపాటు పార్టీలో చేరినవారందనినీ విజయమ్మ అభినందించారు.