హైదరాబాద్,
న్యూస్లైన్: వైఎస్ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు
సంఘీభావంగా కువైట్లోని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పాదయాత్ర
నిర్వహించారు. ఖేతాన్ ప్రాంతం నుంచి తెలుగువారు ఎక్కువగా నివసించే మాలియా
వరకూ 14 కిలోమీటర్ల పొడ వున ఈ యాత్ర సాగిందని పార్టీ ఎన్నారై విభాగం
కన్వీనర్ మేడపాటి వెంకట్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ కమిటీ
సభ్యులు, వైఎస్సార్ అభిమానులు కె.వాసుదేవరెడ్డి, జి.సిద్ధయ్య,
పి.విశ్వనాథ్రెడ్డి, సి.పెంచల్రెడ్డి, ఎం.సుధాకర్రెడ్డి, కె.సహదేవరాజు,
షేక్ మహబూబ్బాషా, సుబ్రమణ్యం రాజుతో సహా పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ
యాత్రలో పాల్గొన్నారని వివరించారు. ఒక మహిళ 3,000 కిలోమీటర్ల పాదయాత్ర
చేపట్టడం ప్రపంచ చరిత్రలోనే రికార్డు అని ఎన్ఆర్ఐలు కొనియాడారు. షర్మిల
పర్యటనకు జనం నీరాజనాలు పడతారని, ఆమెకు మద్దతుగా లక్షలాది మంది మరో
ప్రజాప్రస్థానంలో పాల్గొంటారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి
సాహసోపేతమైన పనులు చేయడం ఒక్క వైఎస్సార్ కుటుంబానికే సాధ్యమవుతుందని వక్తలు
అన్నారు. వైఎస్సార్ కుటుంబానికి తామంతా అండగా నిలబడతామని వారు ప్రతిజ్ఞ
చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వైఎస్ కుటుంబంపై
కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలు కాంగ్రెస్ను
భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.