Monday, 15 October 2012

[YSR Congress Party] జగన్ సీఎం కావడం ఖాయం: మేకపాటి


రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా యువనేత వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాజన్న రాజ్యం తిరిగి వస్తుందని తాము ధీమాగా చెప్పగలమని, మీ పాలన మళ్లీ తీసుకొస్తామని ధైర్యంగా చెప్పగలరా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రశ్నాస్త్రం సంధించారు. అసమర్థ కిరణ్ సర్కారుపై అవిశ్వాసం పెట్టేందుకు చంద్రబాబు ఎందుకు జంకుతున్నారని నిలదీశారు. 

వైఎస్ విజయమ్మకు అవిశ్వాసం అంటే ఏంటో తెలియదని బాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ సహధర్మచారిణిగా, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షనేతగా విజయమ్మకు అన్నీ తెలుసునని చెప్పారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్వర్తించాల్సిన బాధ్యతనే విజయమ్మ గుర్తుచేశారని అన్నారు. వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలకు విపరీత అర్థాలు తీస్తున్నారని విమర్శించారు. 

వైఎస్ జగన్‌ను నిర్బంధంలో ఉంచి కాంగ్రెస్, టీడీపీలు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాయని అన్నారు. 2009 ఎన్నికల తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ ఒక్కచోటైనా గెలిచిందా? అంటూ మేకపాటి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు అనవసర విమర్శలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. షర్మిల పాదయాత్ర అనగానే చంద్రబాబుకు అంత భయం ఎందుకని ఎద్దేవా చేశారు. 'మరో ప్రజా ప్రస్థానం'తో షర్మిల చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు.