Friday, 5 October 2012

సోనియా పశ్చాత్తాపపడే రోజు వస్తుంది

జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి నాలుగు నెలలయింది. ఆయనకు బెయిల్ రాకుండా చేయడానికి సిబిఐ నీచాతినీచంగా దిగజారుతోంది. ఆయన మీద చేస్తున్న ఆరోపణలేవీ కోర్టులముందు నిలబడవని అందరికీ తెలుసు. ఒకవేళ బరితెగించి, తిమ్మినిబమ్మిని చేసి జగన్‌ను చట్టం ముందు దోషిగా నిలబెడితే, అవే కేసుల్లో చంద్రబాబు, కాంగ్రెస్ మంత్రులు కొందరు ముందుగానే జైలుకు పోవాల్సి వస్తుంది.

చెప్పుడుమాటలు విని సోనియా, రాహుల్ జగన్‌పై పగబట్టారు. కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్లుగా కూడా గెలవలేని కొందరు నాయకులు జగన్ గురించి సోనియా, రాహుల్‌లకు తప్పుడు సమాచారమిచ్చారు. అది నమ్మి సోనియా విజయమ్మకు జగన్‌కు సముచిత గౌరవం ఇవ్వలేదు. రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన, కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని అవమానించారు. కాని జగన్ జనంలోకి రావడం, ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టడంతో వాళ్లలో వణుకు పుట్టింది. అప్పటిదాకా కాంగ్రెస్‌కు మీడియా దిక్కులేదు. 

పేపర్లో పేరు చూసుకోవడానికి ఎల్లో మీడియా పెద్దలు చెప్పినట్లల్లా కాంగ్రెస్ పార్టీ వాళ్లు గంగిరెద్దుల్లా ఆడారు. ఆ మీడియా పెద్దలు కాంగ్రెస్ నాయకుల్ని అదిరించి తాము చెప్పినట్లు నడుచుకునేలా చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీడియాను అడ్డంపెట్టుకుని, తెలుగుదేశం అధికారంలో ఉన్నా, లేకున్నా రాష్ట్రాన్ని ఏలారు. రాష్ట్రాన్ని శాసించారు. అధికారంలో ఎవరున్నా పరోక్షంగా తామే పరిపాలన చేశారు. జగన్ సాక్షి పేపర్‌పెట్టి, ఛానల్ పెట్టి ఈ పరిస్థితిని మార్చారు. జనంలో తిరిగి ప్రజల మనిషి అనిపించుకున్నారు. అందుకే ఎల్లో మీడియాకు, తెలుగుదేశం పార్టీకి జగన్ ప్రధమ శత్రువు అయ్యాడు. 

ఎల్లో మీడియా కాంగ్రెస్‌లోని ‘లల్లీపుట్’ నాయకుల్ని ఎగదోసి, కాంగ్రెస్‌లోని తమ సామాజికవర్గ నాయకుల్ని ప్రోత్సహించి ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ అధిష్ఠానానికి జగన్‌కి మధ్య అంతరం పెంచారు. కాంగ్రెస్ పార్టీ తన వేలుతోనే తన కన్ను పొడుచుకునేలా చేశారు. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని జాతీయస్థాయి కాంగ్రెస్ నాయకులు కొందరు ఇందుకు తోడ్పడ్డారు. జగన్‌ని బదనాం చేశారు.

సాక్షి లేకుండా ఉంటే వాళ్ల పథకాలు పారిఉండేవి. వాళ్ల కుట్రలు ఫలించేవి. కాని సాక్షి వల్ల జనానికి నిజం తెలుస్తోంది. ప్రజలు వీళ్ల కుట్రల్ని అర్థం చేసుకున్నారు. కనుకనే ప్రతి ఎన్నికల్లో తాము ఎటు ఉన్నామో చెబుతున్నారు. వీళ్ళు సాగిస్తున్న కుట్రలు ఇక చాలు. జనం వీళ్లని, వీళ్ల నాయకుల్ని నమ్మడం లేదు. జగన్ వెంటే జనం. జనమే జగన్. జగనే జనం.