వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల
శ్రీకాకుళం, న్యూస్లైన్:
ప్రజాదరణ
పొందుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడ్డుకునేందుకు రాష్ట్రంలో అధికార
కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ క్విడ్ప్రోకోకు పాల్పడుతున్నాయని
వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ
విమర్శించారు. శ్రీకాకుళంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్కి
బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై
ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ను రంగంలోకి తెచ్చాయని ఆరోపించారు. 14
నెలలుగా కేసు సాగుతుండగా బెయిల్ పిటిషన్ విచారణ ముందురోజే ఈడీ ఆస్తులు
అటాచ్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. అసలు వైఎస్ ప్రభుత్వం జారీ చేసిన 26
జీవోలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి ఎందుకు వెల్లడించడం లేదన్నారు. అన్ని
ప్రతిబంధకాలనీ దాటుకుని జగన్ ప్రజాన్యాయస్థానంలో విజేతగా నిలుస్తారని
విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న సీబీఐ
చంద్రబాబు అవినీతి కేసులో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి చిదంబరంతో రాజీ చర్చల అనంతరమే బాబు కేసులో సీబీఐ వెనక్కి
తగ్గిందని కొణతాల ఆరోపించారు. రామోజీరావుకు చెందిన ఈనాడులో రిలయెన్స్ అక్రమ
పెట్టుబడుల కేసును సీబీఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.
శ్రీకాకుళం, న్యూస్లైన్: