Friday, 5 October 2012

జన్న కొడుకుకేనా ఈ కష్టాలు...

ఇంటికి, జీవితానికి అండగా ఉండే భర్తను తీసికెళ్లి అన్యాయంగా జైలు పాలు చేశారే... మీ వరకు వస్తేకాని తెలీదు ఆ బాధ, ఆ దుఖం, ఆ వేదన. అయినా ఏ తల్లికి, ఏ బిడ్డలకు, ఏ భార్యకు ఇటువంటి కష్టం రాకూడదని దేవుణ్ణి వేడుకొంటున్నాను.

ఆరోజు ఉదయం పది గంటల నుంచి అన్ని టీవీ ఛానల్స్‌లో ముఖ్యమంత్రి మిస్సింగ్ అనే బ్రేకింగ్ న్యూస్ చూసిన రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారు. రైతు బాంధవుడుగా, విద్యార్థుల భవిష్య నిర్మాణదాతగా, బడుగుజీవుల గృహప్రదాతగా, ఆగిపోబోతున్న గుండెలకు సంజీవని ప్రసాదించిన ప్రాణదాతగా ... ఇలా ప్రతివారికి తన ఆపన్న హస్తాన్ని అందించిన తమ ప్రియతమ నేత రాజన్న క్షేమంగా తిరిగి తమ మధ్యకు రావాలని అన్నిమతాల వారు ఒక్కటై భగవంతుడిని ప్రార్థిస్తూ గడిపారు. తెల్లవారింది. ‘నమస్తే అమ్మా, నమస్తే తాతా, నమస్తే అన్నా...’ అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించే మన రాజన్న ‘ఇక సెలవు’ అంటూ ఆ గగనసీమలో కనుమరుగైపోయాడు. అదిగో అప్పుడే ‘జగన్’ అనే యువకిరణం మన ముందుకు వచ్చాడు.

తండ్రి హావభావాలు, చెరగని చిరునవ్వు కలబోసిన ఆ యువకిశోరాన్ని చూసిన రాష్ట్ర ప్రజలు ఆనందపరవశులయ్యారు. ఒక మనిషిని ఒకసారి చూస్తే కొంతమందికే ప్రేమ పుడుతుంది. కాని జగన్‌ని చూసిన తొలిరోజునే రాష్ట్ర ప్రజలందరూ అంతులేని ప్రేమను పెంచుకున్నారు. తమ కుటుంబ సభ్యునిగా భావించారు. జగన్‌కు పెరుగుతున్న జనాదరణ అధిష్ఠానానికి కంటగింపు అయింది. జగన్ ప్రాభవాన్ని తగ్గించటానికి కుట్రలు పన్నింది. అక్రమ ఆస్తులు కూడబెట్టారంటూ అక్రమ అరెస్టు చేయించింది. తల్లిలాంటి విజయమ్మను, సోదరి భారతిని ఘోరంగా అవమానించింది. తండ్రిని పోగొట్టుకున్న జగన్‌పై అధిష్ఠానం ధోరణిని, సీబీఐ పెట్టిన కేసును, అరెస్టును చూసి రాష్ట్రం నివ్వెరపోయింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ను బ్రతికించిన మన రాజన్న కొడుకుకేనా ఈ కష్టాలు... అంటూ కన్నీరు పెట్టింది. ప్రజలు గమనిస్తున్నారు. పడి లేచే కెరటంలా, కారుమబ్బులు నిండిన ఆకాశాన్ని ప్రకాశవంతం చేసే సూర్యునిలా జగన్ ఈ కుట్రలు ఛేదించుకుంటూ మన మధ్యకు వచ్చేరోజు చాలా తొందరలోనే ఉంది.