Friday, 18 May 2012

‘సాక్షి’లో లగడపాటి తమ్ముడూ పెట్టుబడులు పెట్టారు.. ఆయన్ను అరెస్టు

సీబీఐ, కాంగ్రెస్, చంద్రబాబుకు సూటి ప్రశ్న
కాంగ్రెస్, చంద్రబాబు సీబీఐ దర్యాప్తునూ మేనేజ్ చేస్తున్నారు
సీబీఐ చార్జిషీటును కోర్టు ఇవ్వకముందే ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో వస్తోంది
‘సాక్షి’ని మూసేయించాలని అందరూ కలిసి కుట్ర చేస్తున్నారు

కడప, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి కుమ్మకై అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తనను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక.. అణగదొక్కాలని చూస్తున్నారని, వీరిద్దరూ కలిసి చివరకు సీబీఐ దర్యాప్తును సైతం మేనేజ్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ‘ఈ రోజు కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9.. అందరూ ఒక్కటై సాక్షి పత్రిక, సాక్షి టీవీని మూసేయించాలని కుట్ర పన్నుతున్నారు. 

నేను ఒక్కటే అడుగుతున్నా.. ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టారని ప్రసాద్ గారిని(నిమ్మగడ్డ ప్రసాద్) తీసుకుపోయి జైల్లో పెట్టారు. ‘సాక్షి’లో ల్యాంకో గ్రూప్‌కు చెందిన లగడపాటి రాజగోపాల్ తమ్ముడు కూడా పెట్టుబడులు పెట్టారు. ఆయన్ను తీసుకుపోయి జైల్లో పెట్టే ధైర్యముందా మీకు అని నేను సీబీఐని, కాంగ్రెస్ పెద్దలను, చంద్రబాబును ప్రశ్నిస్తున్నా’ అని జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కె.శ్రీనివాసులు తరఫున జగన్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. మంగంపేట, రైల్వేకోడూరుతో పాటు పలు చోట్ల ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

కోర్టు ఇవ్వకముందే ‘ఈనాడు’లో...

బాధెక్కడ అనిపిస్తోందీ అంటే.. కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కలిసి సీబీఐ దర్యాప్తును కూడా మేనేజ్ చేస్తున్నారు. సాధారణంగా.. సీబీఐ ఒక చార్జిషీటు ఫైల్ చేసి కోర్టుకు ఇస్తుంది. తర్వాత సంబంధిత వ్యక్తులకు ఆ చార్జిషీటు ఇవ్వాలని ఆ కోర్టు చెప్తుంది. కోర్టు దాన్ని ఇచ్చే వరకు అందులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఆశ్చర్యం ఏమిటంటే.. కోర్టు ఇవ్వకముందే చార్జిషీటులో ఏముందో మొత్తం ‘ఈనాడు’ పేపర్ పతాక శీర్షికల్లో వచ్చేస్తోంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అధికార, ప్రతిపక్షాలు కలిసి కుమ్మక్కయ్యాయి. కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు ఇద్దరూ కలిసి కోర్టులకు వెళతారు. వెళ్లి కలిసి కేసులు వేస్తారు. చనిపోయిన వైఎస్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకుని పోటీలు చేస్తారు. ఆర్‌టీఐ కమిషనర్ పదవులను చెరిసగం పంచుకునే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆయనకు సన్నిహితుడైన జీఎన్ నాయుడు అనే వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని ధారాదత్తం చేశారంటే.. వీరి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి నాయకుడే లేడు..

వైఎస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక.. ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు చూడాలని తపించే నాయకుడే కరువయ్యాడు. తాను చనిపోయాక కూడా ప్రతి పేదవాడి ఇంట్లో తన ఫొటో ఉండాలని, అంతగా ఆ పేదవాడికి మేలు చేయాలన్న తాపత్రయం ఏ నాయకుడిలోనూ కనిపించడం లేదు. 

రెండు మూడు నెలల కిందట నేను కడపకు వచ్చినప్పుడు టమాటా కిలో అర్ధరూపాయికే అమ్ముకుంటున్న రైతన్నను పరామర్శించా.. ఉల్లిపాయలు కిలో రూ.2కే అమ్ముకుంటున్న రైతన్ననూ కలిశా. క్వింటాలు పసుపు రూ.2,500 నుంచి రూ.3,000 మధ్య మాత్రమే పలుకుతున్న దయనీయ స్థితిలో ఉన్న పసుపు రైతుతోనూ మాట్లాడా. వైఎస్ మరణించాక ఏ రైతును కదిలించినా.. ‘ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కంటే ఉరి వేసుకోవడం మేలనిపిస్తోందన్నా’ అని అంటుంటే చాలా బాధనిపిస్తోంది. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టదు. క్రాప్ హాలిడే ప్రకటించి లక్ష ఎకరాలు బీడుగా వదిలేసినా పట్టించుకునే నాథుడు లేడు. ఇక కూలి పనులు చేసుకునే అక్కచెల్లెమ్మల పరిస్థితి మరీ దయనీయం. కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, శ్రీకాకుళం జిల్లాల నుంచి అక్కాచెల్లెమ్మలు పిల్లా పాపలతో కలిసి వలసపోయి పొలాల్లో పని చేసుకుంటున్నారు. 

జిల్లాలకు వెళ్లినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. వారిని ఎందుకమ్మా ఇంత దూరం వచ్చారు.. మీకు ఉపాధి పనులు కూడా దొరకడం లేదా అని అడిగితే... ‘కనీస వేతనం రూ.137 ఇవ్వాలని ఓ వైపు ప్రభుత్వమే చెప్తోంది.. మరోవైపు అదే ప్రభుత్వం క్యూబిక్ మీటర్ చొప్పున కాంట్రాక్ట్ ఇస్తోంది.. దీంతో రూ.60 నుంచి రూ.70 కూడా మాకు రావడం లేదన్నా’ అని చెప్తుంటే చాలా బాధనిపించింది.

దున్నపోతు మీద వానలా.. సర్కారు వైఖరి: ప్రతి ఇంటి నుంచీ కనీసం ఒక్కరైనా ఇంజినీరో, డాక్టరో అవ్వాలని, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలని.. అప్పుడే ఆ ఇంటి నుంచి పేదరికం పోతుందన్న ఉద్దేశంతో వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టారు. ఇవాళ చదువుకునే ఏ పిల్లాడిని అడిగినా.. ‘అన్నా నేను కాలేజీకైతే పోతున్నాను కానీ.. ఈ ప్రభుత్వం ఫీజు కడుతుందో కట్టదో అన్న భయంతోనే చదువుతున్నా. మీరు ఈ ఏడాది ఫీజు గురించి అడుగుతున్నారు... కానీ మాకు నిరుటి స్కాలర్‌షిప్పు డబ్బులే రాలేదన్నా’ అంటున్నాడు. విద్యార్థుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు చేశాం.. దీక్షలు చేశాం.. అయినా దున్నపోతుమీద వర్షం కురిసినట్లుగా ప్రభుత్వ వైఖరి ఉంది. ఇక వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చూస్తే.. దాన్ని ఓ పథకం ప్రకారం నాశనం చేస్తోందీ ప్రభుత్వం. రాష్ట్రంలో 18 స్థానాలకు జరుగుతున్నఉప ఎన్నికలు ఈ పాలకులకు గుణపాఠం నేర్పాలి. రాబోయే మహాసంగ్రామానికి నాంది పలకాలి. మనం వేసే ప్రతి ఓటు.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయతీకే పట్టం కట్టాలి.

సీఎం పీఠంపై మీ బిడ్డే కూర్చుంటాడు..

త్వరలో ఓ సువర్ణయుగం వస్తుంది. ఆరోజు మీ బిడ్డ సీఎం పీఠంపై కూర్చుంటాడు. అప్పుడు నేను మంగంపేటకు వ స్తా! రచ్చబండ నిర్వహిస్తా! ఎవరికైనా పింఛను రాలేదా? ఇల్లు లేదా? చదవాలనే కోరిక ఉండి ఎవరైనా ఆర్థిక స్తోమత అనుకూలించక చదవలేకపోతున్నారా? ఎవరికైనా ఆరోగ్యశ్రీ కార్డు లేదా? అని అడిగితే ఒక్క చేయి కూడా పైకి లేవని స్థాయిలో సువర్ణ పాలన అందిస్తా. అప్పుడే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మకు నిజమైన శాంతి. 
- మంగంపేటలో జగన్‌మోహన్‌రెడ్డి

తీవ్ర జ్వరం.. అయినా ఆగని రోడ్‌షో

మండుతున్న ఎండలనూ లెక్కచేయకుండా జనంతో మమేకమవుతూ రోడ్‌షోలు నిర్వహిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం తీవ్ర జ్వరం వచ్చింది. శుక్రవారం కూడా ఎండ వేడిమి తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ ఆయన ప్రచారం ఆపలేదు. యథావిధిగా రోడ్‌షో నిర్వహించారు. ప్రతీ పల్లెలో ప్రచార రథం దిగి వచ్చి మహిళలను ఆప్యాయంగా పలకరించి, చిన్న పిల్లలు, వృద్ధులకు ముద్దులు పెడుతూ అభిమానాన్ని పంచారు. 

జగన్ పట్టుదలను చూసి ప్రజలు నివ్వెరపోయారు. కాగా రెండు రోజులపాటు రైల్వే కోడూరు నియోజకవర్గంలో జగన్ నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అడుగడుగునా జగన్‌కు జనాభిమానం అడ్డుపడడంతో ఆయన కాన్వాయ్ ముందుకు కదలడమే కష్టమైంది. సమయాభావం వల్ల చాలా గ్రామాలకు జగన్ వెళ్లలేకపోయారు. శుక్రవారం పర్యటనను ముగించుకుని జగన్ నేరుగా రేణిగుంట చేరుకుని అక్కడి నుండి రైల్లో ఒంగోలు వెళ్లిపోయారు. అక్కడ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రైల్వే కోడూరు పర్యటనలో జగన్ వెంట.. మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్, డీసీసీ బ్యాంకు చైర్మన్ బ్రహ్మానందరెడ్డి తదితరులున్నారు.