Thursday, 3 May 2012

సమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం

నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: పట్టణాలతోపాటు పల్లెల్లో కూడా సమస్యలు పేరుకుపోతున్నాయని, వీటిని పరిష్కరించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు, నరసన్నపేట అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. పదవులను కాపాడుకోవటంలోనే కాంగ్రెస్ నాయకులు తలమునకలయ్యారని మండిపడ్డారు. నరసన్నపేట మండలం చింతువానిపేట, ఉర్లాం, బొడ్డవానిపేట తదితర గ్రామాల్లో గురువారం ఆయన ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో ప్రజలకు వివరించారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు.

చింతువానిపేటలో కొందరు మహిళలు మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి సౌకర్యం లేదని, పైప్ లైన్లు వేసినా నీరు రావడం లేదని కృష్ణదాస్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు చేదోడు, వాదోడుగా ఉన్నానని గుర్తుచేశారు. గ్రామాల్లో ఇలాంటి సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణమని చెప్పారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తోందని విమర్శించారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని వివరించారు. మంచినీటి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని అధికార, ప్రతిపక్ష నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. వారి మాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉర్లాంలో ప్రచారం నిర్వహించారు.

ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని కోరారు. కోట దుర్గమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఎండ మండిపోతున్నా పట్టించుకోకుండా జనం కృష్ణదాస్‌ను ఆదరించారు. ఈ ప్రచారంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంత్ కిరణ్, మహిళా విభాగం అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ, పార్టీ నాయకులు రణస్థలం మాజీ ఎంపీపీ బూరెల్ల కిరణ్‌కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు టి.సీతారాం, దవళ రమేష్, గొర్లె అప్పలసూర్యనారాయణ, జి.భాస్కరరావు, పోలాకి రమణయ్య, సురంగి నర్సింగరావు, పోలాకి నర్సింహమూర్తి, సతివాడ రామినాయుడు, నడిమింటి సత్యాలు, ఉర్లాం పార్వతీశం పాల్గొన్నారు.