Friday, 18 May 2012

నేడు ఒంగోలు నియోజకవర్గంలో జగన్ ప్రచారం

- కొత్తపట్నం మండలం నుంచి ప్రారంభం
- ఒంగోలు గాంధీనగర్‌లో ముగింపు 
ఒంగోలు కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఒంగోలు రానున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన పర్యటన వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి జగ న్‌మోహన్‌రెడ్డి ఒంగోలు చేరుకొని లాయర్‌పేటలోని వైవీ భద్రారెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. శనివారం ఉదయం 9 గంటలకు ఒంగోలు నుంచి బయలు దేరి కొత్తపట్నం మండలం ఈతముక్కల, మడనూరు గ్రామాల్లో జరిగే ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. 

అనంతరం ఒంగోలు మండలం పరిధిలోని చెరువు కొమ్ముపాలెం, యరజర్ల, సర్వేరెడ్డిపాలెం, వెంగముక్కపాలెంలో పర్యటిస్తారు. ఆ తర్వాత ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్‌లో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో జగన్ ప్రసంగిస్తారు. అక్కడ నుంచి పాత మార్కెట్ సెంటర్‌లో జరిగే రోడ్‌షోలో మాట్లాడతారు. తదనంతరం కర్నూలు రోడ్డులోని సెయింట్ జేవియర్స్ సమీపంలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత గాంధీనగర్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు.