Thursday, 20 December 2012

[YSR ] సామాన్యుడి రక్తం సలసలమంటోంది


నేనొక సామాన్య గృహిణిని. నాకు రాజకీయాలు, చట్టం, సెక్షన్స్ ఏమీ తెలియవు. అయినా జగన్‌పై కేసు చూస్తుంటే ఆశ్చర్యం, విస్మయం, కలవరం కలుగుతున్నాయి. నాకే కాదు, అరవై దశాబ్దాలు దాటిన స్వతంత్ర భరతావనిలో ఇటువంటి కేసు ఒకటి నడవటం మేధావులను, ఆలోచనాపరులను అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అసలు ప్రభుత్వధనాన్ని జగన్ ఎలా దోచుకోగలరు? ఆయన ఏమైనా ఒక ప్రభుత్వ ఉద్యోగా? అధికారా? మంత్రా? ఒకవేళ ఎంపీగా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర పరిపాలనాధికారాలు జగన్‌కెలా సంక్రమిస్తాయని సీబీఐ అభియోగాలు మోపుతూ ఛార్జిషీట్లు వేస్తుంది? ఒక వ్యక్తి ప్రభుత్వం నుండి లబ్ధి పొందాడంటే కిందిస్థాయి ఉద్యోగి నుండి పైఅధికారుల వరకూ అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

అలాగే ఒక వ్యక్తికి అనుగుణంగా జీఓ పాస్ చేయాలంటే కేబినెట్ మంత్రి మండలి మొత్తం బాధ్యత వహించాలి. ఆ విధంగా చూసినా, వారందరినీ వదిలివేసి జగన్‌ని టార్గెట్ చేసి జైలులో బంధించడం అన్యాయం, అక్రమం కాక ఏమిటి? మొత్తం కేబినెట్ ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడే పత్తిత్తులు అయిపోయారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు లేఖ రాస్తాడు. దానికి టీడీపీ వారు పిటిషన్స్ జత చేస్తారు. దాన్ని కోర్టు వారు విచారణకి ఆదేశిస్తే ‘‘ప్రజా ప్రయోజనాలు ఆశించి కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టామని సీబీఐ వారు అతి (తెలివి) గా ప్రకటిస్తారు. ఎంత కుట్ర! ఎంత కుతంత్రం!!

జగన్ జైల్లో ఉండడం చూస్తున్న ప్రతి సామాన్యుడి రక్తం సలసలా మరుగుతోంది. జగన్‌పై నెలల తరబడి రాజకీయ కక్షసాధింపు కేసు సాగడాన్ని ప్రజలు భరించలేకపోతున్నారు. వారి అగ్రహం కట్టలు తెంచుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పే రోజు తప్పక వస్తుంది. ఆ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం. జగన్‌ని లొంగదీసుకోవాలని ఢిల్లీ పెద్దలు ఆడుతున్న నాటకం ఫలించదు. అంతిమ విజయం జగన్‌దే.
- కె.పద్మావతి, ఘట్‌కేసర్


జగన్‌కు రక్షణ కవచం ప్రజలే...
కొన ఊపిరితో చావుబతుకులలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి తన పాదయాత్రతో జవసత్వాలు అందించి, మళ్లీ ప్రజల మన్ననలు పొందేలా చేసి రాష్ట్ర, కేంద్రాలలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత వైఎస్సార్. పేదవాడి ఆకలిబాధను అర్థం చేసుకుని, తన పాలన ద్వారా బడుగు, బలహీనవర్గాల గుండెకోతకు మందు ఇచ్చిన ప్రజావైద్యుడు ఆయన. ఆ మహానేత మరణంతో అనాథ అయిన రాష్ట్రానికి తిరిగి అంతటి భరోసా ఇచ్చే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోయాడు. ఆ సమయంలో -జగన్‌గారు తన తండ్రి మరణం తట్టుకోలేక మరణించిన ప్రతి కుటుంబాన్ని కలుస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రారంభించిన ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ పెద్దలు ఎక్కడలేనన్ని ఆటంకాలు కలిగించారు. యువనేతకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేక కుట్రలు కుతంత్రాలు పన్నారు.

వీటన్నిటిని తట్టుకోలేక బయటకు వచ్చి ప్రజలపక్షాన నిలిచి వారి కష్టాలపై పోరాటాలు చేస్తూ జననేతగా ఎదిగిన జగన్మోహన్‌రెడ్డి వల్ల తాము పిపీలకాలైపోతామన్న భయాందోళనలతో ఎన్నడూ లేని విధంగా పాలక ప్రతిపక్షాలు కుమ్మక్కై కేసుల పేరుతో ఎన్నో నీచరాజకీయాలు చేశారు. అయినప్పటికీ ప్రజలు జననేత పక్షానే నిలిచారు. దీన్ని తట్టుకోలేక ఎలా అయినా జనవాణిని అణిచివేయాలి అని యువనేతను జైలు పాలు చేశారు. ఈ దుశ్చర్యతో జన స్పందన, జనాగ్రహంగా మారి ఉపఎన్నికలలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు లేకుండా పోయాయి.

ప్రజలు వై.యస్. మీద నమ్మకంతో అధికారం అప్పగిస్తే ఆయన గతించిన తరువాత ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి యాత్రలు చేయడం మాని, పదవుల కోసం హస్తిన యాత్రలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ చర్యలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నాయకులంతా ప్రజాతీర్పు కోరే రోజు దగ్గరిలోనే ఉంది. ఎవరెన్ని దుష్ట అస్త్రాలు ప్రయోగించినా వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కాపాడుకోవడానికి ప్రజలు రక్షణ కవచమై ఆయనకు తోడు, నీడగా ఎప్పటికీ నిలిచి ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు.
- కళ్యాణ్ అన్నపరెడ్డి, సత్తెనపల్లి, గుంటూరు జిల్లా