Friday, 28 December 2012

[YSR ] జనం ఆశలన్నీ జగన్ మీదే

టీడీపీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు కోట్లకు అమ్ముడుపోతున్నారని అబద్ధాలు పలుకుతున్న చంద్రబాబు, ఎన్ని కోట్లు తీసుకుని కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చారు? ఎన్ని కోట్లు చెల్లించి ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో బంధించి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు? ఎన్ని కోట్లు తీసుకుని ఈ ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పార్టీని ‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టకుండా కాపాడుతున్నారు?

ప్రపంచబ్యాంకు మెప్పుకోసం రాష్ట్రంలో అన్నిరంగాలనూ... ముఖ్యంగా వ్యవసాయాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు, రాష్ట్రంలో 3,500 మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడైన చంద్రబాబు ప్రజల జ్ఞాపకశక్తిని చాలా తక్కువగా అంచనా వేసి ప్రజల మీద తనకున్న చులకన భావం వ్యక్తపరుస్తున్నాడు. ‘వ్యవసాయమే దండగ’ అన్న ఉద్దండుడు, ‘రైతులు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అన్న పెద్దమనిషి, ‘రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవలసిందే’ అని ఎద్దేవా చేసిన వ్యక్తి, ‘భూములు పంచితే పేదరికం పోదు’ అన్న పెద్దమనిషి, ‘నీటి ఎద్దడి పోవాలంటే తుఫానులే శరణ్యం’ అంటూ రైతులను ఆగర్భశత్రువుల్లా చూసిన ఘనుడు, ‘ఒకసారి పంట ఎండితే తెలిసొస్తుంది’ అంటూ అన్నదాతకు శాపనార్థాలు పెట్టిన వ్యక్తి, తన స్వీయరచన ‘మనసులో మాట’ పుస్తకంలో సబ్సిడీలు ఇవ్వరాదని రాసుకున్న వ్యక్తి... ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ రైతుల పట్ల మొసలికన్నీరు కార్చడం ఈ శతాబ్దపు వింత. చంద్రబాబు మర్చిపోయారేమో కానీ, 28 ఆగస్టు 2000లో విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా ఆందోళన చేసిన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులను తుపాకులతో కాల్పించిన ఘటన, అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘటన ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కూడా రాణించలేక పూర్తిగా విఫలమయ్యారని యావత్ ప్రజానీకం, రాజకీయ నిపుణులు, మేధావులు ఘంటాపథంగా చెబుతున్నారు. ‘సంక్షేమం నిల్ - బాదుడు ఫుల్’ కొనసాగిస్తున్న ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వం మాకొద్దు మొర్రో అని ఈ రాష్ట్ర ప్రజలంతా మొత్తుకుంటుంటే చంద్రబాబు ‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకుండా కుంటిసాకులతో కాలయాపన చేస్తున్నారు. అందుకే చంద్రబాబుని గానీ, కాంగ్రెస్‌ను గానీ నమ్మే స్థితి రాష్ట్రంలో లేదు. ప్రజల ఆశలన్నీ జగన్ మీదే. జగన్ తప్పక విడుదలవుతారు. తప్పక ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తారు. 

- ఆదిరెడ్డి యానాదిరెడ్డి, శ్రీకాళహస్తి, చిత్తూరు

ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం

ప్రపంచదేశాల్లోని ముఖ్యమంత్రుల్లో పేరుగాంచిన, ఉత్తమ పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన దివంగత నేత డా॥వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి. ఆయన ఎప్పుడైతే చనిపోయారో అప్పటినుండీ ఈ రాష్ట్రానికి శని పట్టింది. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆశయాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రజాసమస్యలపై పోరాటాలు, దీక్షలు చేస్తూ ప్రజలకు చేరువౌతున్న జగన్‌ని చూసి తట్టుకోలేని పాలకపక్షం, ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్థలు కలిసి ‘సీబీఐ’ అనే మంత్రదండాన్ని ఉపయోగించి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయించారు. 

జగనన్నను రాజకీయంగా ఎదుర్కోలేని కొందరు స్వార్థ రాజకీయ నిరుద్యోగులు, అసమర్థ పాలకులు దొడ్డిదారిన చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని, ఆయన కుటుంబాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. నీచ రాజకీయాలు చేస్తూ వైఎస్సార్ కుటుంబంపై బురద చల్లాలని వారు ప్రయత్నిస్తున్నకొద్దీ ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా జగనన్న పట్ల జనస్పందన, ప్రేమాభిమానాలు అంతగా పెల్లుబుకుతున్నాయి. కాని ప్రజలకు కష్టాలు తీరే రోజు త్వరలో రానుంది. దేవుడు మావైపు ఉన్నాడు, రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. అతి త్వరలో జగనన్న బయటకు వస్తారు. వైఎస్సార్ కుటుంబానికి అండగా మేముంటాం. జననేత కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం.