Wednesday, 12 December 2012

[YSR ] నేను ఓటింగ్‌లో పాల్గొన్నా: మేకపాటి


ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో తాను పాల్గొనలేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి చెప్పడం శోచనీయం అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సురవరం వంటి నాయకుడు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడ్డం సరికాదన్నారు. మంగళవారం న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. తాను ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఓటు చేశానని డివిజన్ సందర్భంగా తన నంబర్ 363 అని మేకపాటి తెలిపారు. ఈ విషయాన్ని లోక్‌సభ రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. ఎఫ్‌డీఐలపై చర్చ సందర్భంగా తనకు మాట్లాడేందుకు అనుమతిని ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను అడిగానని, అవకాశం ఇస్తామని ఆమె హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సమయం లేనందు వల్ల తనకు మాట్లాడే అవకాశం రాలేదని, తాను ముందుగా సిద్ధం చేసుకున్న నోట్‌ను స్పీకర్ కార్యాలయంలో అందజేశానని, ఇలా నోట్ ఇస్తే సభ్యుడు తన అభిప్రాయాన్ని సభలో వ్యక్తీకరించినట్లుగానే పరిగణిస్తారని మేకపాటి తెలిపారు. ఇలా నోట్ ఇచ్చింది తానొక్కడినే కాదని, కేసీఆర్ వంటి నాయకులు కూడా మాట్లాడే అవకాశం లభించక అదే పని చేశారని తెలిపారు. తాను ఓటింగ్‌లో పాల్గొన్నానని, ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఓటు చేశానని పునరుద్ఘాటించారు.