[YSR ] తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలి
తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటు పట్ల కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న
కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు.
రెండుసార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి కేంద్రం తీసుకున్న చర్యలేంటి?
ఇప్పటిదాకా కాంగ్రెస్ సాధించిన పురోగతి ఏంటి? అని సూటిగా ప్రశ్నించారు.
ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి ఉందని చెప్పుకున్న కాంగ్రెస్ నేతలు పార్టీ
వైఖరిపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. బాజిరెడ్డి
బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. హోంమంత్రి
మారారంటూ ఒకసారి, కొత్తపార్టీ వచ్చిందని మరోసారి అఖిలపక్షం పేరుతో
డ్రామాలాడటం కాంగ్రెస్కు రివాజుగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ
ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉంటే పదేపదే అఖిలపక్ష సమావేశాలను ఎందుకు
ఏర్పాటు చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్ను నిలదీయాల్సిన
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పని చేయకపోగా అదే పార్టీతో
దోబూచులాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి చెప్పిన
తర్వాత వైఎస్సార్సీపీ కూడా వెల్లడిస్తుందని గోవర్ధన్ స్పష్టం చేశారు.