Thursday, 20 September 2012

కాంగ్రెస్-సీబీఐ-రాజకీయం!


‘‘వచ్చే పార్లమెంట్  ఎన్నికల్లో గెలిచేందుకు మా అస్త్రాలు మాకున్నాయి’’-కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మాత్యులు వీరప్ప మొయిలీ నోటి నుంచి వెలువడిన మాటలివి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైఎస్ జగన్ ప్రభంజనం ఖాయమని ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్ ఎన్డీటీవీ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ఈ సందర్భంగా ఎన్డీటీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మొయిలీ ఈ మాట అన్నారు. ఇదే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జగన్ సతీమణి వైఎస్ భారతి.. మీ అస్త్రం సీబీఐయేనా అంటూ మొయిలీని ప్రశ్నించడంతో ఆయన నీళ్లు నమలక తప్పలేదు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థగా అవతరించిన సీబీఐ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థగా పరిణామం చెందడం నడుస్తున్న చరిత్ర చెబుతున్న సత్యం.

తన మాట వినని వారిపైకి సీబీఐని ఉసిగొల్పడంలో కాంగ్రెస్ ప్రదర్శించే ‘చాతుర్యం’ బహిరంగ రహస్యం. సీబీఐ పేరుతో అసమ్మతి నేతలను అదిమి పట్టడంలో హస్తం పార్టీ ఆరితేరిపోయిందన్న ఆరోపణలు కోకొల్లలు. వ్యతిరేక గళం వినిపించే నాయకుల నోళ్లు నొక్కేందుకు, మాట వినని వారిని తన దారిలోకి తెచ్చేందుకు సీబీఐవైపే కాంగ్రెస్ చూస్తుందన్న విమర్శల వెల్లువకు అంతేలేదు. దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’- అధికార పార్టీల సేవలో తరిస్తుండడం సంప్రదాయంగా వస్తోంది. ద్వంద్వ ప్రమాణాలతో ప్రధాన దర్యాప్తు సంస్థ ప్రతిష్ట క్రమక్రమంగా మసకబారుతోంది. కాంగ్రెస్ పార్టీ సొంత ప్రయోజనాల కోసం సీబీఐని సోపానం వాడుకుంటుందోనని గళమెత్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీన్ని బట్టే అర్థమవుతోంది సీబీఐని కాంగ్రెస్ ఎంత ‘సమర్థవంతం’గా వాడుకుంటుందో?


కాంగ్రెస్-సీబీఐ బంధంపై తాజాగా బీజేపీ జాతీయ నాయకుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆసక్తికర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అత్యంత విశ్వసనీయ భాగస్వామి సీబీఐ మాత్రమేనని, ఆ సంస్థ ఎంతకాలం శక్తిమంతంగా ఉంటే అంతకాలం యూపీఎ ప్రభుత్వం ఉంటుందని ఆయన అన్నారు. యూపీఏ.. సీబీఐని అడ్డంపెట్టుకుని మైనారిటీని మెజారిటీగా, మెజారిటీని మైనారిటీగా తారుమారు చేస్తోందన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రస్తుతం మైనారిటీలో పడిందని, అధికారంలో కొనసాగే హక్కు కోల్పోయిందని అన్నారు. సీబీఐ కేసుల సాకుతో కొన్ని పార్టీలను బెదిరిస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంటును, దేశ ప్రజలను చివరకు తనతో కలిసొచ్చే భాగస్వామ్య పక్షాలనూ వంచించిన యూపీఏ ప్రభుత్వం ఇంకా అధికారంలో కొనసాగితే మరింత అభాసుపాలవుతుందని చెప్పారు.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నోసార్లు ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అంటూ సీబీఐని నిర్వచించారు. ఆయనే కాదు చాలా మంది నేతలు ఇదే రకమైన అభిప్రాయాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తపరిచారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా... ‘నవ్విపోదురు నాకేటి సిగ్గు’ చందంగా సీబీఐతో కాంగ్రెస్ తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు పోరుపెడుతున్నా చెవికెక్కించుకోకుండా చెలరేగిపోతోంది. యూపీఏ సంకీర్ణ సర్కారును కాపాడుకునేందుకు మాయావతి, ములాయం సింగ్ యాదవ్ లాంటి నాయకులను సీబీఐ కేసుల పేరుతో కాంగ్రెస్ తన దారికి తెచ్చిందన్న ఆరోపణలు చాలా కాలంగా వినబడుతున్నాయి.


వచ్చే ఎన్నికల్లోనూ తమ ‘ఆయుధం’కు పదును పెడతామని వీరప్ప మొయిలీ చెప్పడంతో కాంగ్రెస్ వైఖరి తేటతెల్లమయింది. పజలు గమనిస్తున్నారన్న జంకు కూడా కాంగెస్‌కుఉన్నట్టు కనబడడం లేదు. అధికారంతో ఏమైనా చేయొచ్చని వీర్రవీగుతోంది. తమకు ‘పవర్’ ప్రసాదించిన ప్రజలను పట్టించుకోకుండా, అధికారాన్ని కాపాడుకునేందుకు పాకులాడుతున్న ‘పురాతన పార్టీ’ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నది యధార్థం. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పే తిరుగులేని ఆయుధం. దీని ముందు ఏ అస్త్రమైనా దిగదుడుపే.