Tuesday, 25 September 2012

వైఎస్‌ను కాపీ కొట్టినా సీఎం కాలేవు

చంద్రబాబూ... నీవు వైఎస్‌ను కాపీ కొట్టి పాదయాత్ర చేసినా ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేవని మాలమహానాడు అధ్యక్షులు కారెం శివాజీ ధ్వజమెత్తారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నాడని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల మధ్య విభజన చేయాలని చూడటం ఒక పార్టీ అధ్యక్షుడికి తగదన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని కులాలవారు తెలంగాణ వాదానికి ఓటేస్తారే తప్ప తెలుగుదేశం పార్టీ ప్రకటించే తాయిలాలకు ఓట్లు వేయరని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశన్న, అధ్యక్షులు బండి శ్రీను, హైదరాబాద్ కార్యదర్శి ఎం.మల్లేష్, అధ్యక్షులు వెన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.